ఢిల్లీ, 06 అక్టోబర్ (హి.స.)
రాజస్థాన్లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం జరగటంతో 6 మంది పేషంట్లు చనిపోయారు. మరో 5 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జైపూర్లోని సవాయ్ మన్ సింగ్ (ఎస్ఎమ్ఎస్) ఆస్పత్రిలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా సెకండ్ ఫ్లోర్లోని ట్రోమా ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
దీంతో విషపూరితమైన వాయువులు విడుదల అయ్యాయి. ప్రమాదం జరిగినపుడు ఐసీయూలో 24 మంది పేషంట్లు ఉన్నారు. వారిలో 11 మంది ట్రోమా ఐసీయూలో, మరో 13 మంది అడ్జసెంట్ ఐసీయూలో ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. హుటాహుటిన పేషంట్లను అక్కడినుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, విషవాయువుల కారణంగా 6 మంది చనిపోయారు. మరో 5 మంది పరిస్థితి విషమంగా ఉంది.
దీనిపై ఎస్ఎమ్ఎస్ ఆస్పత్రి ట్రోమా సెంటర్ ఇన్ఛార్జ్ అనురాగ్ ధకడ్ మాట్లాడుతూ.. ‘మా ట్రోమా సెంటర్లోని సెకండ్ ఫ్లోర్లో రెండు ఐసీయూలు ఉన్నాయి. వాటిలో 24 మంది పేషంట్లు ఉన్నారు. ట్రోమా ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. మంటలు చాలా వేగంగా ఇతర ప్రాంతాలకు పాకాయి. విష వాయువులు విడుదల అయ్యాయి. ట్రోమా సెంటర్ టీమ్, నర్సులు, వార్డ్ బాయ్లు వెంటనే వారిని రక్షించే ప్రయత్నం చేశాం. ఆరుగురు చనిపోయారు. మరో 5 మంది పరిస్థితి సీరియస్గా ఉంది’ అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ