
అమరావతి, 13 నవంబర్ (హి.స.)
గుంటూరు: మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబుతో పాటు ఇతర నేతలపై పట్టాభిపురం పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులను బెదిరించారని, తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ బీఎన్ఎస్ 132, 126(2), 351(3), 189(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. అనుమతులు లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్కు ఆటంకం కలిగించారని ఆరోపించారు. భారీ ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలిగించారని పోలీసులు చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై బుధవారం అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైకాపా ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదని డీఎస్పీ అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు అంబటికి చెప్పినా వినలేదు. దీంతో కంకరగుంట వంతెన పైకి వైకాపా నేతలను వెళ్లనివ్వకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు. అంబటి అనుచరగణంతో వాటిని బలవంతంగా నెట్టి వంతెనపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులను నెట్టేశారు. సీఐ వెంకటేశ్వర్లు, డీఎస్పీ అరవింద్తో రాంబాబు వాగ్వాదానికి దిగారు. లా అండ్ ఆర్డర్కు ఆటంకం కలిగిస్తున్నారని డీఎస్పీ చెబుతున్నా.. ‘మాకు తెలియదు మరి.. మేము చిన్నపిల్లలం.. మీరు చెప్తే వినాలి’.. అంటూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. సీఐని బలవంతంగా తోసి పక్కకు నెట్టడంతో ఆయన టోపీ కింద పడిపోయింది. అడ్డుకున్న కానిస్టేబుల్పైనా దురుసుగా వ్యవహరించారు. గతంలోనూ ఇదే సీఐపై అంబటి జులుం ప్రదర్శించారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మార్కెట్యార్డు మాజీ ఛైర్మన్ రాజనారాయణ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుమతులు లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్కు ఆటంకం కలిగించారని, ప్రజలకు అసౌకర్యం కలిగించారని అంబటి మీద కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. (Andhra Pradesh News)
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ