
అమరావతి, 17 నవంబర్ (హి.స.)
తిరుచానూరు: తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చన చేశారు. అనంతరం నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్తంభ తిరుమంజనం నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వి.వీరబ్రహ్మం, సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో హరింద్రనాథ్, కంకణ భట్టార్ పి.శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబు స్వామి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఈవో శ్రీ శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూలమూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో గజ వాహన సేవ, పంచమీ తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ