
షాద్నగర్, 2 నవంబర్ (హి.స.)
షాద్ నగర్ పట్టణంలో నిర్వహిస్తున్న
నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థినులు రోడ్లపైకి వచ్చి ఆదివారం మెరుపు ధర్నాకు దిగారు. గురుకులంలో జరుగుతున్న అవినీతి అక్రమాల పై వారు గొంతెత్తి చాటుతూ రోడ్డుపైకి వచ్చారు. విద్యార్థినులను ఆందోళన నుంచి ఆపడానికి అధ్యాపక బృందం ప్రయత్నం చేసింది. కానీ విద్యార్థినులు వారిని లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి న్యాయం చేయాలి అంటూ గొంతెత్తి చాటారు.
అయితే ఈ క్రమంలో పట్టణ చౌరస్తాకు చేరుకున్న విద్యార్థినులు ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు ఆందోళన విరమింప చేయడానికి బలవంతంగా విద్యార్థినులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు విద్యార్థినులకు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థినులను బలవంతంగా కొంతమందిని పోలీసు వాహనంలోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు. మహిళా సిబ్బంది సరిగ్గా లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు