
తిరుమల, 22 నవంబర్ (హి.స.)ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. క్యూ లైన్లో స్నేహితులతో కలిసి ప్రసాదాన్ని కించపరిచేలా మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల హిందూ ధార్మిక సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, ఇటీవల శివజ్యోతి తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లారు. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఉండగా, టీటీడీ సేవకులు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆ సమయంలో ప్రసాదాన్ని అందుకున్న శివజ్యోతి, ఆమె స్నేహితుడు తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం... రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ వ్యాఖ్యానించారు.
పైగా ఇదేదో గొప్ప పని అయినట్టు... ఈ సంభాషణను వీడియో తీసి, తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు టీటీడీ ఇప్పటికే ప్రాంగణంలో రీల్స్, వీడియోలపై నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, పవిత్రమైన ప్రసాదాన్ని అగౌరవపరిచిన శివజ్యోతి, ఆమె స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV