న్యూఢిల్లీ, 29 ఏప్రిల్ (హి.స.:దేశ భవిష్యత్తు కోసం యువతను సిద్ధం చేయడంలో విద్యా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విద్యా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ శతాబ్దానికి అనుగుణంగా విద్య వ్యవస్థను అధునీకరించే దిశగా తమ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకొంటుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో వైయూజీఎం సదస్సులో ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ప్రపంచ విద్యా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించామన్నారు. ఈ విద్య విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత.. జాతీయ పాఠ్యాంశాల్లోనే కాకుండా.. అభ్యస, బోధనా విధానంలో పలు మార్పులు చూస్తున్నామని పేర్కొన్నారు. వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ కింద ఏఐ (కృతిమ మేథ) అధారిత మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. దీనిని సైతం విస్తరించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల