అమరావతి, 21 మే (హి.స.)
ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్-బీజాపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దు ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ప్రముఖ నక్సల్ నాయకుడు బసవరాజు సహా 27 మంది నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చాయి. నక్సలిజంపై పోరాటంలో ఈ ఆపరేషన్ ఒక పెద్ద విజయంగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.
ఈ అంశంపై సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా స్పందించిన అమిత్ షా భద్రతా దళాలను ప్రశంసించారు. “నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం. ఈరోజు, ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్లో జరిగిన ఆపరేషన్లో మన భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి. వారిలో సీపీఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రధాన పురోగతికి మన ధైర్యవంతులైన భద్రతా దళాలు, ఏజెన్సీలను నేను అభినందిస్తున్నాను. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత.. 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశారు. 84 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈ వార్తను పంచుకోవడం సంతోషంగా ఉంది.” అని అమిత్ షా రాసుకొచ్చారు.
మార్చి 31, 2026 లోపు నక్సలిజాన్ని నిర్మూలించాలని మోడీ ప్రభుత్వం సంకల్పించిందని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రధాని మోడీ సైతం స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్ ను పంచుకున్నారు.”ఈ అద్భుతమైన విజయానికి కారణమైన మన దళాలను చూసి గర్విస్తున్నాం. మావోయిజం ముప్పును తొలగించి, మన ప్రజలకు శాంతియుత, ప్రగతి జీవితాన్ని అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.” అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ