
అమరావతి, 29 ఏప్రిల్ (హి.స.)
యానాం, : ప్రముఖ పారిశ్రామికవేత్త, యానాం రీజెన్సీ గ్రూపు ఆఫ్ కంపెనీస్ అధినేత డాక్టర్ జీఎన్ నాయుడు(87) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1983లో రీజెన్సీ సెరామిక్స్ను జీఎన్ నాయుడు ప్రారంభించారు.
2012లో మూతపడిన రీజెన్సీ సెరామిక్స్..
యానాంలోని రీజెన్సీ సెరామిక్స్ కంపెనీలో గతంలో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. 2012 జనవరిలో కార్మికులు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఆ సమయంలో కార్మిక సంఘం నాయకుడి మృతితో మిగతా కార్మికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్లాంట్లోకి ప్రవేశించి పెను విధ్వంసం సృష్టించారు. పరిశ్రమలోని వాహనాలు, యంత్రాలకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. కంపెనీ రికార్డులను తగలబెట్టారు. ఈ ఘటనలో రీజెన్సీ కంపెనీ ప్రెసిడెంట్ కేసీ చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసాత్మక ఘటన కారణంగా రీజెన్సీ సెరామిక్స్ కంపెనీ లాకౌట్ ప్రకటించింది. దాదాపు దశాబ్దం పాటు మూతపడిన ఈ కంపెనీని 2024లో తిరిగి పునరుద్ధరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ