హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నప్పటికీ యూరియా దొరకడం లేదు. దీంతో సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో యూరియా కొరతకు నిరసనగా రైతులు ధర్నాకు దిగారు. ఆందోళనకు దిగిన అన్నదాతలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్ధతు ప్రకటించారు. ధర్నాలో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. అరెస్టు చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావును రాయపర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు నినాదాలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..