అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)
అనంతపురం క్రీడలు, ఖరీదైన ఆట క్రికెట్లో పేద బాలికలు రాష్ట్ర జట్టుకు ఎంపిక కావాలంటే ఆషామాషీ కాదు. ఈ ఇద్దరు బాలికలు పేదరికాన్ని జయించి క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నారు. తల్లిదండ్రులు చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగాలు చేసి కూతుళ్లను ప్రోత్సహిస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 16 ఏళ్లకే అండర్-19 జట్టులో స్థానం సాధించారు. వారే బి.నేహా, డి.చక్రిక. ఆంధ్ర క్రికెట్ మహిళా లీగ్ పోటీలకు సైతం ఎంపికై జిల్లా కీర్తిని ఇనుమడింపజేస్తున్నారు. లేత వయసులోనే బ్యాటు, బంతి చేతబట్టిన వీరు ఏకంగా ఏపీఎల్ క్రికెట్ పోటీలకు ప్రాతినిధ్యం వహించారు. అనంత క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందిన వీరు అండర్-15 విభాగంలో ఆంధ్ర జట్టుకు ఎంపికై రాణించారు. ఈ ఇద్దరి ప్రతిభ వెనక ఆర్డీటీ ప్రోత్సాహం, సహకారం ఉండటం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ