నల్గొండ, 14 సెప్టెంబర్ (హి.స.)
కర్ణాటక, మహారాష్ట్ర తో పాటు తెలుగు
రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పెరిగింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు నిన్న రాత్రి 7 గేట్లను ఎత్తి 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో దిగువన ఉన్న నాగార్జున సాగర్ జలాశయాని ఆదివారం ఉదయానికి భారీగా వరద ప్రవాహం పెరగడంతో అప్రమత్తం అయిన అధికారులు.. జలాశయం మొత్తం 26 గేట్లు ఎత్తివేసి 2,23,564 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు 2,74,007 క్యూసెక్కుల వరద నీరు వస్తుందని, వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఉన్నట్టుండి మొత్తం గేట్లను ఎత్తడంతో.. సాగర్ కు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు