అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.)
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు (స్పష్టం చేశారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో విశాఖ నోవాటెల్లో ఏర్పాటు చేసిన ఈస్ట్ కోస్ట్ మారీటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర - 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దే అంశంపై చంద్రబాబు పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించారు.
‘‘దక్షిణాదిలో ఏపీ నెంబర్వన్ రాష్ట్రంగా మారుతుంది. భవిష్యత్తులో రోడ్లు, రైలు, సముద్రం, ఎయిర్ లాజిస్టిక్స్ పెరుగుతాయి. రోడ్ల అనుసంధానం జరిగినట్లు నదులను కూడా కలపాలి. ఇవాళ ఇళ్లపైనే విద్యుదుత్పత్తి చేసుకుంటున్నాం. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెరిగేలా అనేక చర్యలు చేపట్టాం. ఏఐ, క్వాంటమ్ వ్యాలీ పరిధి రోజు రోజుకూ పెరుగుతోంది. డ్రోన్లు, రోబోటిక్స్, ఐవోటీ, సెన్సార్స్ను వాడుకుంటున్నాం. ప్రతిరంగంలోనూ స్పష్టమైన సమాచారం ఉంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించాం. వన్ ఫ్యామిలీ.. వన్ ఆంట్రపెన్యూర్.. అనేది నా లక్ష్యం. నీటి భద్రత విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి. దేశంలో నదుల అనుసంధానం చేపట్టాలని ఎప్పటినుంచో కోరుతున్నా. గంగా నుంచి కావేరీ వరకు నదులను అనుసంధానం చేయాలి.
ఏపీకి 1,053 కి.మీ తీరప్రాంతం ఉంది. ఇది మనకు పెద్ద ఆస్తి. ప్రస్తుతం బల్క్ రూపంలోనే 90శాతం కార్గో రవాణా చేస్తున్నాం. ఎయిర్ కార్గో ద్వారా వేగంగా సరకులు పంపిణీ చేయవచ్చు. రైలు కనెక్టవిటీలో ఏపీ చాలా అనుకూలంగా ఉంది. లాజిస్టిక్స్ విషయంలో ఈస్ట్కోస్ట్లో మనదే అగ్రస్థానం కావాలి. ఇప్పటికే మనకు 6 పోర్టులున్నాయి.. మరికొన్ని పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. 2046 నాటికి పోర్టులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతి 50 కి.మీ దూరానికి ఒక పోర్టు ఉండేలా చూస్తాం. ఫార్మా, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీదే అగ్రస్థానం. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలోనూ మంచి వృద్ధి సాధిస్తున్నాం. మన పోర్టుల అభివృద్ధికి సహజసిద్ధ వనరులు ఉన్నాయి. షిప్బిల్డింగ్ విషయంలో మనదేశం చాలా వెనుకబడి ఉంది’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎయిర్కార్గో వసతులు అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా లాజిస్టిక్ సంస్థల ప్రతినిధులు కోరారు. ఈ సమ్మిట్లోనే ఎయిర్కార్గో ఫోరమ్ ఇండియా లోగోను సీఎం ఆవిష్కరించారు. దాదాపు 20 కంపెనీల సీఈవోలు సదస్సులో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ