
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.)
అకాల వర్షాలు కురుస్తున్న (Unseasonal Rains Telangana) నేపథ్యంలో రైతులందరు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులకు అక్కడే అందుబాటులో ఉన్న టార్పలిన్ కవర్లు అందించినట్టు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలలో రైతుల ఉత్పత్తులకు నష్టం కలగకుండా సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఉచితంగా టార్పలిన్లు:
ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తుల రాకపోకలు అధికంగా కొనసాగుతున్న దృష్ట్యా, ఆకస్మిక వాతావరణ మార్పులు, అధిక తేమ, పురుగు సమస్యలు, అగ్ని ప్రమాదాలు మరియు ఇతర అనుకోని పరిస్థితుల వల్ల మౌలిక సదుపాయాల పరంగా తాత్కాలిక నిల్వ కోసం తగినంత గోదాములు సురక్షిత ప్రదేశాలు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు తగినంత టార్పాలిన్లు ఉచితంగా అందించాలని సూచించారు. ఉత్పత్తులను నేరుగా నేలపై నిల్వ చేయకుండా చెక్క పలకలు లేదా ఎత్తైన వేదికలను వినియోగించాలని సూచించారు. మార్కెట్ షెడ్లు, గోదాముల పైకప్పులు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు. వర్షం లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే నిల్వలను కవర్డ్ ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రతిరోజు వాతావరణ సూచనలను గమనించి రైతులు, వ్యాపారులకు సమాచారం అందించడంతో పాటు, మాన్సూన్ ఆకస్మిక వర్షాల సమయంలో తక్షణ స్పందన చర్యలు తీసుకునేందుకు టార్పాలిన్ బృందాలను సిద్ధంగా ఉంచాలని, పీక్ సీజన్లో మార్కెట్ సెక్రటరీలు స్వయంగా పర్యవేక్షణ చేయాలని మంత్రి సూచించారు.
24 గంటల టీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణ:
భద్రతా పరంగా రాత్రి సమయంలో తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని, నిల్వల రక్షణ కోసం భద్రతా సిబ్బందిని నియమించాలన్నారు. సాధ్యమైనచోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతుల అవగాహన పెంపొందించేందుకు జాగ్రత్త సూచనలను మార్కెట్ యార్డులో స్పష్టంగా ప్రదర్శించాలని, మార్కెట్కు తీసుకురావడానికి ముందు ఉత్పత్తులను బాగా ఎండబెట్టడం, శుభ్రపరచడం, గ్రేడింగ్ చేయడంపై అవగాహన కల్పించాలన్నారు. తూకం, లేలం ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు