
ఢిల్లీ,03ఫిబ్రవరి (హి.స.) ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సప్ మాతృ సంస్థ మెటా (Meta)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు మా దేశ గోప్యతతో ఆడుకోలేరు. మా డేటాలోని ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి మేం అనుమతించం. ఒకవేళ దేశ చట్టాలను పాటించకపోతే భారత్ను వీడి వెళ్లొచ్చు’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. 2021లో వాట్సప్లో గోప్యతా విధానానికి సంబంధించిన ఓ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
తమ వాణిజ్య ప్రయోజనాల కోసం వాట్సప్ వినియోగదారుల డేటాను మెటాతో పంచుకుంటోందని.. ఇది దోపిడీ కిందకే వస్తుందని ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. మెటాను హెచ్చరించారు. కొన్నిసార్లు మెటా విధానాలను అర్థం చేసుకోవడానికి తాము కూడా ఇబ్బందిపడతామన్నారు. ఒకసారి తనకు ఓ వైద్యుడు వాట్సప్లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపితే.. దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్లో కనిపించాయన్నారు. ఇక దేశంలోని లక్షలాదిమంది పేద, చదువురాని ప్రజలు ఈ విధానాలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ