పాకిస్థాన్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్
టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది.
India pakistan match


హైదరాబాద్, 05 ఫిబ్రవరి (హి.స.)టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026)లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తటస్థ వేదికైన శ్రీలంకలో ఈ మ్యాచ్ జరుగుతున్నప్పటికీ పాక్.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ తొలగించడంతో వారికి మద్దతుగా పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో బంగ్లాదేశ్ పాక్‌కు షాకిచ్చింది.

భారత్‌తో మ్యాచ్ ఆడబోమంటూ పాక్ తీసుకున్న నిర్ణయంపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగకపోతే క్రికెట్ ప్రపంచం మొత్తం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుందని బంగ్లాదేశ్ సీనియర్ డైరెక్టర్ ఒకరు స్థానిక మీడియాతో అన్నారు. అలానే తమ వాటా కూడా తగ్గిపోతుందని, ఆర్థిక నష్టాన్ని చేకూర్చే ఇలాంటి విధానాలను తాము కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. పాక్ వైఖరి ఇతర బోర్డుల నష్టం తెచ్చిపెట్టేలా ఉందని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో సదరు డైరెక్టర్ భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. 'బీసీసీఐకి గట్టి సందేశం ఇవ్వాలని పాకిస్థాన్ కోరుకుంటున్నట్లు ఉంది. క్రికెట్ ప్రపంచంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తోంది. ఆ కోణంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీసుకున్న నిర్ణయం ఒక రకంగా సరైనదే అయి ఉండవచ్చు' అని అన్నారు. భారత్, పాక్ మ్యాచ్ వివాదం.. ఐసీసీ సెంట్రల్ రెవెన్యూ పూల్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కం చెందిన మరో సీనియర్ అధికారి అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande