శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్‌ బోర్డు? యూటర్న్‌?
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ : పాకిస్తాన్‌ యూటర్న్‌
Cricket image


హైదరాబాద్, 07 ఫిబ్రవరి (హి.స.)పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఓటు వేసి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నిర్ణయాన్ని వ్యతిరేకించిన పీసీబీ.. భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామంటూ నాటకానికి తెరతీసింది. ఈ విషయం గురించి పాక్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ స్వయంగా ప్రకటించడం గమనార్హం.

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా ఐసీసీ కుదిర్చిన ఒప్పందం ప్రకారం.. పాక్‌ కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేశారు. పాక్‌ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడేలా షెడ్యూల్‌ ఖరారైంది.

భారత్‌- బంగ్లా.. మధ్యలో పాక్‌

అయితే, భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు భారత్‌లో రక్షణ ఉండదని.. అందుకే తమ వేదికను కూడా లంకకు మార్చాలంటూ బంగ్లా బోర్డు ఐసీసీని కోరింది. బంగ్లా వాదనలో నిజం లేదని తేల్చిన ఐసీసీ ఇందుకు నిరాకరించింది. అయినా సరే బంగ్లాదేశ్‌ పంతం వీడలేదు. ఫలితంగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది ఐసీసీ.

భారత్‌తో మాత్రమే ఆడమంటూ

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందని.. లంకలో భారత్‌తో మ్యాచ్‌కు తమకు భద్రత ఉండదంటూ పాక్‌.. టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. లీగ్‌ దశలో మిగతా మ్యాచ్‌లకు లేని ఇబ్బంది భారత్‌తో మాత్రమే ఉందని చెప్పడం పాక్‌ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. అంతేకాదు.. ఒకవేళ భారత్‌- పాక్‌ మ్యాచ్‌ నిజంగానే ఆగిపోతే ఐసీసీతో పాటు సభ్య బోర్డులన్నింటికీ పెద్ద ఎత్తున నష్టం వస్తుంది.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీలంక క్రికెట్‌ బోర్డు పాకిస్తాన్‌కు లేఖ రాసింది. గతంలో పాక్‌లో తమ జట్టుపై ఉగ్రదాడి జరిగినా.. తిరిగి ఆ దేశంలో పర్యటించిన తొలి జట్టుగా నిలిచామని గుర్తు చేసింది. ఇటీవల కూడా బాంబుల మోతతో దద్దరిల్లిన వేళ పాక్‌లో పర్యటించి పరిమిత ఓవర్ల సిరీస్‌ పూర్తి చేశామని సుతిమెత్తగానే చురకలు అంటించింది.

ఉగ్రదాడిని గుర్తుచేస్తూ

అలాంటిది.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక.. అకస్మాత్తుగా మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. ఆర్థికంగా భారీ నష్టం వస్తుందని.. ఈ అంశంలో పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇలా పాత విషయాలు ముఖ్యంగా ఉగ్రదాడిని గుర్తుచేస్తూ లంక బోర్డు రాసిన లేఖ పాక్‌ను ఇరకాటంలో పడేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ బోర్డు చైర్మన్‌, పాక్‌ మంత్రి మొహ్సిన్‌ నక్వీ భారత్‌తో మ్యాచ్‌ ఆడే విషయమై పునరాలోచన చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయం గురించి పీసీబీ సన్నిహిత వర్గాలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ..

గతంలో సాయం చేశాము కదా!

‘‘శ్రీలంక ప్రభుత్వం, క్రికెట్‌ బోర్డుతో పాకిస్తాన్‌ ఎల్లప్పుడూ సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. అందుకు తగిన ఫలాలు పొందింది. కాబట్టి లంక బోర్డు నుంచి వచ్చిన లేఖను పాక్‌ నిర్లక్ష్యం చేయలేదు.

లంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా.. మొహ్సిన్‌ నక్వీని నేరుగా సంప్రదించి.. పాక్‌ తమకు సాయపడాల్సిందిగా కోరారు. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ల వల్ల వచ్చే అదనపు ఆదాయానికి గండికొట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తాము పాక్‌ బోర్డుకు సహాయపడిన విషయాన్ని గుర్తు చేశారు.

నక్వీ ఈ విషయం గురించి తప్పక ప్రధాని దృష్టికి తీసుకువెళ్తారు. శ్రీలంక బోర్డు మాత్రమే కాదు.. శ్రీలంక ప్రభుత్వం కూడా గతేడాది నవంబరులో ఆటగాళ్లు మధ్యలోనే వెళ్లిపోకుండా ఒప్పించి.. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ పూర్తి చేసేలా ఒప్పించారు’’ అని పేర్కొన్నాయి.

కఠిన చర్యలు తప్పవు

ఇదిలా ఉంటే.. పాక్‌ అన్నంత పనిచేస్తే ఐసీసీ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐసీసీతో పాటు బ్రాడ్‌కాస్టర్లు, ఇతర సభ్య దేశాలు పెద్ద ఎత్తున నష్టపోయే క్రమంలో పీసీబీని ఆ పరిహారం చెల్లించాలని కోరే అవకాశాలు లేకపోలేదు. పరిస్థితి చేయిదాటితే ఇంకాస్త కఠినంగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా ఫిబ్రవరి 15న భారత్‌- పాకిస్తాన్‌ మధ్య వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande