
శ్రీకాళహస్తి, , 12 మార్చి (హి.స.) : శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ఆనుకుని కైలాసగిరులు దాదాపు 5 వేల ఎకరాల్లో విస్తరించాయి. 24 కిలోమీటర్ల పొడవునా దట్టమైన అటవీ ప్రాంతమే. వేసవి వస్తుందంటే తరచూ అగ్నిప్రమాదాలు జరిగి ఎకరాల మేర పచ్చదనమంతా బూడిద కావడం పరిపాటిగా మారింది. మొన్నటికి మొన్న సౌర ప్రాజెక్టుకు సమీపంలో భారీగా మంటలు చెలరేగడంతో ప్రాజెక్టుకు ఇబ్బందులు వస్తాయని రాత్రింబవళ్లు శ్రమించి అదుపులోకి తీసుకువచ్చారు.
కైలాసగిరుల్లోని హరితాభివృద్ధికి సిబ్బందిని దేవాదాయశాఖ కింద నియమించారు. ఉద్యాన అభివృద్ధి కోసం నందనవనం, ఉద్యానశాఖలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో దాదాపు 35 మంది ఉద్యోగులు ఇక్కడి అటవీ సంరక్షణ పేరుతో జీతాలు తీసుకుంటున్నా అటవీ ప్రాంత పర్యవేక్షణకు అయిదారుగురు మాత్రమే ఉన్నారు.
ఏటా ఇదే తంతు..: అటవీ అభివృద్ధి, సంరక్షణకు ముక్కంటి ఆలయం తరఫున భారీగా నిధులు వ్యయం చేస్తున్నారు. వర్షాకాలానికి ముందు లక్షల్లో మొక్కలు నాటుతున్నారు. వెళ్లలేని ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా విత్తన బంతులు చల్లిన దాఖలాలూ ఉన్నాయి. ఇలా అటవీ సంరక్షణకు ఏటా రూ.25 లక్షల వరకు వెచ్చిస్తున్నా.. సరైన రక్షణ వ్యవస్థ లేక ప్రమాదాలతో వృక్ష సంపదంతా భస్మీపటలమైపోతోంది
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ