
హైదరాబాద్, 13 మార్చి (హి.స.)భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో చీకటి రోజు నమోదైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు దలాల్ స్ట్రీట్ను ముంచేశాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీలు పేకమేడల్లా కూలిపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. వారం చివరి రోజున మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బిఎస్ఇ సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు (1.93%) పతనమై 74,563 వద్ద ముగిసింది. నిఫ్టీ 50: 488.05 పాయింట్లు (2.06%) క్షీణించి 23,151 వద్ద స్థిరపడింది.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు..
* ఇరాన్ రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఆందోళనలు పెరిగాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత భయాలతో బ్రెంట్ ముడి చమురు ధర $100.5 మార్కును దాటింది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ.
* అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలం పుంజుకోవడంతో, భారత రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 92.37 స్థాయికి పడిపోయింది.
* విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం తమ వాటాలను విక్రయిస్తున్నారు. ఒక్క మార్చి నెలలోనే ఇప్పటి వరకు రూ.39 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మార్కెట్ను మరింత కుంగదీసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు