
భూపాలపల్లి, 26 మార్చి (హి.స.)
ఎమ్మారై యంత్రం ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ సరఫరా పనుల్లో జాప్యం పై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించి ఎమ్మారై పరికరం, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఎమ్మారై యంత్రం ఏర్పాటు కోసం అవసరమైన విద్యుత్ సౌకర్యాల కల్పనలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉన్నట్లు గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ విధులకు గైర్హాజరు కావడంపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ఎమ్మారై యంత్రం ఏర్పాటు పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆర్డీవోను పర్యవేక్షణ సంబంధిత అధికారిగా నియమించామని తెలిపారు. విద్యుత్ సరఫరా ఏర్పాటుకు అవసరమైన పరికరాలను ఇప్పటికీ సమకూర్చకపోవడంపై కలెక్టర్ ప్రశ్నిస్తూ, ఈ విధంగా కొనసాగితే పనులు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడతాయని అసహనం వ్యక్తం చేశారు. యంత్రం ఏర్పాటు ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప పర్యవేక్షకులు డా.వెంకటరత్నం, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా రాజేష్, టిజిఎంఎస్ ఐడీసీ ఏఈ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు