
హైదరాబాద్, 26 మార్చి (హి.స.)
జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ అమోదం తెలిపింది. గురువారం సభలో చర్చ జరిగిన అనంతరం జీఎస్టీ సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. సేల్స్ టాక్స్ కమిషనర్ పోస్టును చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్గా మార్పు చేశారు. అలాగే అదనపు కమిషనర్ (గ్రేడ్-1) పోస్టును స్టేట్ టాక్స్ కమిషనర్గా మార్చుతూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. ఒకే దేశం, ఒకే చట్టం నినాదంతో జీఎస్టీ చట్టాన్ని చేసినప్పటికీ కేంద్రం, రాష్ట్రంలోని శాఖాధిపతుల మధ్య హోదాలో తేడాలు ఉండటం వల్ల వీటన్నింటిని యూనిఫామ్ చేసేందుకు ఈ చట్ట సవరణ చేస్తున్నామని సభలో ప్రభుత్వం వెల్లడించింది.
జీఎస్టీ చట్టం లక్ష్యాం నెరవేర్చేందుకు అవసరమైన కమ్యూనికేషన్, కో ఆర్డినేషన్ కోసం సులభతరం కావాలని అందుకనే మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా సేల్స్ టాక్స్ కమిషనర్ పోస్టును చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్గా, అదనపు కమిషనర్ (గ్రేడ్-1) పోస్టు.. స్టేట్ టాక్స్ కమిషనర్గా మార్చుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లు ద్వారా ఆర్థిక పరమైన అంశాలేమి లేవని, ఉద్యోగాలు తగ్గవనని ఈ బిల్లుపై చర్చ సందర్భంగా సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ సవరణ ద్వారా రాష్ట్రానికి వచ్చే నష్టమేమి లేదని తెలిపారు. అనంతరం సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు