
అమరావతి, 31 మార్చి (హి.స.)రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు రేపు(బుధవారం) లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టనుంది. లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. లేదంటే ఎల్లుండి(ఏప్రిల్ 2) పార్లమెంట్ ఉభయసభల్లోనూ ఆమోదం పొందవచ్చని తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ అధికారులు ఈ బిల్లును లోక్సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు పేరుతో కేంద్రం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది.
ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 2కి సవరణలు చేస్తున్నట్లు బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. సబ్ సెక్షన్ 2లో అమరావతి ఏపీ రాజధానిగా ఏర్పడిందని కేంద్రం పేర్కొంది. ఏపీ సీఆర్డీఏ చట్టంలోని క్యాపిటల్ ఏరియాలో అమరావతి ఏర్పడుతుందని అధికారులు వివరించారు. ఇప్పటికే అమరావతి చట్టబద్ధత బిల్లును ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్