
అమరావతి, 31 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. ఇవాళ రెండు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఏపీలో భిన్న వాతావరణం ఇవాళ ఉండనుంది. ద్రోణి ప్రభావంతో అల్లూరి, శ్రీకాకుళం, పోలవరం, కర్నూలు, నంద్యాల, విజయ నగరం, మన్యం, విశాఖపట్నం, అనంతపురం, నెల్లూరు లాంటి జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు మన్యం, పోలవరం, తూర్పు గోదావరి, ఏలూరు, విజయనగరం జిల్లాలలో మాత్రం భిన్నమైన వాతావరణం ఉండనుంది. ఈ జిల్లాలలో తీవ్రమైన వడ గాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. భిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింత స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో ఎక్కువగా వర్షపాతం నమోదు అవుతోంది. ముఖ్యంగా అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో నిన్న అర్ధరాత్రి నుంచి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురు గాలులు విపరీతంగా వీస్తున్నాయి. వర్షాలు ఉత్తర తెలంగాణ నుంచి హైదరాబాద్ వైపు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చల్లటి వాతావరణం నెలకొంది. అదే సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా రాబోయే రెండు గంటల్లో వర్షం పడే ఛాన్స్ లో ఉన్నట్లు వాతావరం శాఖ హెచ్చరికలు జారీ చేసింది
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV