
అలహాబాద్,10 ఏప్రిల్ (హి.స.)
అలహాబాద్ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం. గతేడాది ఆయన నివాసంలో జరిగిన భారీ నగదు రికవరీ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన ఏడాది తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం న్యాయవ్యవస్థలో ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, సుమారు ఏడాది క్రితం జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో లెక్కలోకి రాని నగదు లభ్యమైందని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కొలీజియం, ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలు నిశితంగా పరిశీలన జరిపాయి. అప్పటి నుంచి ఆయన విధులకు సంబంధించి కొంత అనిశ్చితి నెలకొంది. రాజీనామాకు గల ఖచ్చితమైన కారణాలను ఆయన బహిర్గతం చేయనప్పటికీ, గతేడాది నాటి అవినీతి ఆరోపణలు, దర్యాప్తు ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణమని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఉన్నత న్యాయస్థానాల్లో పనిచేసే న్యాయమూర్తులపై ఇటువంటి ఆరోపణలు రావడం, తదనంతర పరిణామాల్లో వారు రాజీనామా చేయడం న్యాయవ్యవస్థ పారదర్శకతపై చర్చకు దారితీస్తోంది. జస్టిస్ యశ్వంత్ వర్మ తన సుదీర్ఘ కెరీర్లో అనేక కీలక తీర్పులు ఇచ్చినప్పటికీ, ఈ నగదు ఆయన పదవీకాలం చివరిలో వివాదం మాయనిమచ్చగా మిగిలిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..