
హైదరాబాద్, 12 ఏప్రిల్ (హి.స.)
హైదరాబాద్ నగరంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. నగరంలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు గంజాయి మత్తులో రెచ్చిపోయి వరుస దాడులకు పాల్పడ్డారు. మత్తులో ఉన్న వారిలో ఇద్దరు యవకులు బైక్పై జియాగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్ సమీపంలోని ఓ సందులో అతివేగంగా వచ్చి, ఎదురుగా వచ్చిన ఆటో డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు.
యువకులు ఆటోడ్రైవర్పై దాడి చేయడమే కాకుండా ఆటోలు ఉన్న వృద్ధులపై కూడా దాడికి యత్నించారు. ఈ దాడి ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులపై కూడా యువకులు దాడికి పాల్పడ్డారు. గంజాయి మత్తులో ఉన్న యువకులు మొదటి దాడితో ఆగకుండా, అనంతరం తమ గ్యాంగ్ సభ్యులతో కలిసి తిరిగి సంఘటన స్థలానికి వచ్చి మళ్లీ దాడులకు పాల్పడ్డారని బాధితులు పేర్కొన్నారు.
భయంతో గేటు మూసుకున్నప్పటికీ, యువకులు గేటుపై రాళ్లతో దాడి చేయడంతోపాటు గేటుపైకి ఎక్కి ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారని.. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi