
మహారాష్ట్ర, 13 ఏప్రిల్ (హి.స.)
ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ ను సిమెంట్ మిక్సర్ బలంగా ఢీకొట్టడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పెను విషాదం మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోమవారం ఉదయం సంభవించింది. ముర్బాద్ సమీపంలోని గోవిలి గ్రామం వద్ద ఉన్న రైతా వంతెనపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కళ్యాణ్ నుంచి ముర్బాద్ వెళ్తున్న ప్రయాణికులతో కూడిన వ్యాన్, ఎదురుగా వస్తున్న సిమెంట్ మిక్సర్ వాహనం ముఖాముఖి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10:45 గంటల ప్రాంతంలో వంతెనపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు అత్యంత వేగంగా ఉండటంతో ఢీకొన్న ధాటికి వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. వ్యాన్లో ఉన్న వారిలో 11 మంది మరణించగా, ప్రాణాలతో బయటపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే ఉల్లాస్నగర్లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ముర్బాద్ తహసీల్దార్ అభిజీత్ దేశముఖ్ వెల్లడించారు. జిల్లా గ్రామీణ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు