ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి కీలక సూచనలు
ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి కీలక సూచనలు చేశారు
విజయసాయి రెడ్డి


అమరావతి, 14 ఏప్రిల్ (హి.స.)

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ, ఆయన సోషల్ మీడియా వేదికగా కొన్ని కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. అప్పుల డబ్బుతో, గొప్ప భ్రమలతో రాజధానిని రాత్రికి రాత్రే నిర్మించలేరని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చారిత్రక నగరాల నిర్మాణాన్ని గుర్తుచేశారు. 1537లో కెంపె గౌడ స్థాపించిన బెంగళూరు, 1591లో కులీ కుతుబ్ షా నిర్మించిన హైదరాబాద్, 1639లో బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న చెన్నై మహానగరాలుగా మారడానికి వందల సంవత్సరాలు పట్టిందని విశ్లేషించారు. ఈ నగరాలను హడావిడిగా నిర్మించలేదని, అవి తరతరాలుగా సహజసిద్ధంగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు.

అమరావతి నిర్మాణం విషయంలో కూడా ఇదే విధానం అవసరమని సాయిరెడ్డి సూచించారు. ముందుగా పరిపాలనకు అవసరమైన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన నివాస గృహాలను నిర్మించాలని తెలిపారు. ఆ తర్వాత నిర్మాణాలను అక్కడితో ఆపివేసి, ప్రజలు, వ్యాపారాలు, కాలంతో పాటు అమరావతి సహజసిద్ధంగా ఎదిగేందుకు అవకాశం ఇవ్వాలని సలహా ఇచ్చారు. రాజధాని నగరం అప్పులతో కాకుండా బలంతో ఎదగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆకర్షణీయమైన డిజైన్లు, భారీ మౌలిక సదుపాయాల పేరుతో విచ్చలవిడిగా ఖర్చు చేయడం దార్శనికత కాదని, అది ఆర్థిక దుబారాకు దారితీస్తుందని హెచ్చరించారు. ఈరోజు అనవసరంగా ఖర్చు చేసే ప్రతి రూపాయి, భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలపై పెను భారం మోపుతుందని అన్నారు. ఆదాయం రాని ప్రాజెక్టులకు రుణాలు తేవడం మంచిది కాదని, పరిపాలనకు ఆడంబరమైన నిర్మాణాలు కాకుండా కార్యాచరణ ముఖ్యమని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్త వహించకపోతే, అమరావతి ఒక ఆదర్శ రాజధానిగా కాకుండా, ఒక భారీ దుబారా ప్రాంతంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande