
అమరావతి, 17 ఏప్రిల్ (హి.స.)రాష్ట్రవ్యాప్తంగా శ్రీవాణి నిధుల వినియోగంతో 5 వేల దేవాలయాలను రాబోయే రెండేళ్లలో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయంలో దేవాదాయ శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..” శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించాం. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 25-30 వరకూ ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుంది. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలి. వారి నుంచి ప్రతిపాదనలు తీసుకుని నిర్మాణం చేపట్టండి. ఆలయాల నిర్మాణానికి సంబంధించి మూడు రకాల డిజైన్లతో పైలెట్ ప్రాజెక్టుగా నిర్మించాలి. వీటి నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ దేవాలయానికీ ప్రహరీ నిర్మాణం చేపట్టాలి. ”అని సీఎం స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi