
అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలో మరో కీలక ఘట్టం పూర్తయ్యిందని అన్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని తక్కువ సమయంలోనే పూర్తి చేయడాన్ని ప్రశంసించారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
సీఎం చంద్రబాబు ట్వీట్ ఇదే..
'ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో నేడు మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1,372 మీటర్ల పొడవైన 'డయాఫ్రం వాల్' నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఇంజనీర్లకు అభినందనలు. దీనికి సహకరించిన కేంద్ర సంస్థలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతినిధులకు ధన్యవాదాలు.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డి-వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు వెచ్చించి నిర్మించాం. డయాఫ్రం వాల్ పూర్తి కావటంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ పనులు వేగవంతం అవుతాయి. ఇప్పటికే ప్రకటించినట్లు అన్ని పనులు పూర్తి చేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితమిస్తాం' అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ