
హైదరాబాద్, 02 ఏప్రిల్ (హి.స.)
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్ నగరం యొక్క 'బ్రాండ్ ఇమేజ్'ను దెబ్బతీస్తోందని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (MLA Sudheer Reddy) ఆరోపించారు. గురువారం ఆయన దోమతెర, ఫాగింగ్ యంత్రంతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మార్షల్స్ ఆయనను అడ్డుకున్నారు. సుధీర్ రెడ్డి వద్ద దోమతెర, ఫాగింగ్ యంత్రం ఉండటంతో వాటిని లోపలికి అనుమతించబోమని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సుధీర్ రెడ్డి జోక్యం చేసుకుని.. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఏవీ జరగడం లేదని, అలాంటప్పుడు లోనికి రావొద్దనడానికి కొత్త నిబంధనలు ఏంటని మార్షల్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారిని నెట్టుకుంటూ లోపలికి వెళ్లారు. అక్కడ దోమతెర ధరించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే దోమల నివారణకు చర్యలు చేపట్టి హైదరాబాద్ ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు.
'సీఎం రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మసకబారుతోంది. దోమల భయానికి ప్రజలంతా నగరం వదిలి పారిపోయే పరిస్థితి నెలకొంది' అని ఆయన ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు దోమల నియంత్రణకు కనీస చర్యలు తీసుకోవడం లేదని సుధీర్ రెడ్డి ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు