అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు: జనార్దన్ రెడ్డి
అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు: జనార్దన్ రెడ్డి
Janardhan reddy


నంద్యాల, 20 ఏప్రిల్ (హి.స.)ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు సమపాళ్లలో అందించేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో అనాథగా మారిన ఏపీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తిరిగి గాడిలో పెట్టారని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, బనగానపల్లెలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడారు.

భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలు అందించి, భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే శక్తిని ఇవ్వాలని బీసీ జనార్దన్ రెడ్డి కోరుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజల తరఫున చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పటిష్ఠమైన వ్యవస్థ ఏర్పడాలన్న, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్న చంద్రబాబు వంటి దృఢమైన నేతతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. పేదల అభ్యున్నతి - సంక్షేమం కోసం నిరంతరం చంద్రబాబు పరితపిస్తున్నారని పేర్కొన్నారు.

సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లని చెప్పిన దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. నవ్యాంధ్ర అభివృద్ధి, పేదల అభ్యున్నతి కోసం సీఎం సేవలను ఉపయోగించుకుంటామని అన్నారు. భవిష్యత్తులో టెక్నాలజీ ఏవిధంగా మార్పు చెందుతుందో.. ముందే ఊహించగల విజనరీ లీడర్ చంద్రబాబు అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande