
అమరావతి, 20 ఏప్రిల్ (హి.స.)వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాము తన గుడ్లను తానే తిన్నట్లుగా జగన్ వ్యవహారం ఉందని విమర్శించారు. తన ధనదాహం, అధికారదాహానికి ఎవరు అడ్డొచ్చినా తల్లైనా, చెల్లైనా, బాబాయ్ అయినా ఎవరైనా ఒకటేనని ఎద్దేవా చేశారు. ఈరోజు(సోమవారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. జగన్ క్రిమినల్ రాజకీయాలు చేస్తున్నారనే విషయాన్ని.. వైసీపీ కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచించాలని అన్నారు.
పెద్ద దస్తగిరి హత్య, బాబాయ్ హత్య, జగన్ కారు చక్రాల కింద నలిగిన కార్యకర్త ఇలా ఎన్నో ఉదాహరణలు జగన్ నైజాన్ని బహిర్గతం చేస్తున్నాయని తెలిపారు. జగన్ సన్నిహితుడు నిత్యానంద రెడ్డి సొంత పార్టీకి చెందిన దస్తగిరిని హత్య చేయటం జగన్ స్వార్ధాన్ని తెలుపుతోందన్నారు. తాడేపల్లిలో తనకున్న అనుబంధంలో భాగంగానే దస్తగిరి హత్య జరిగిందని ఆరోపించారు. హింసా రాజకీయాలు నడిపే వారికి రాష్ట్రంలో చోటు లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి.. వైసీపీకి ఏపీలో చోటు లేకుండా చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్