
హైదరాబాద్, 20 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్కు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సోదరుడి ఆరోగ్యంపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
కల్యాణ్ బాబుకు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన క్షేమంగా, నిలకడగా ఉన్నారు. వేగంగా కోలుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు అని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు. పవన్ తిరిగి సాధారణ కార్యకలాపాల్లోకి రావడానికి సుమారు వారం రోజులు పట్టవచ్చని వైద్యులు సూచించినట్లు తెలిపారు.
పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రార్థనలు చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు. ఆయనకు సంపూర్ణ శక్తి, సాంత్వన చేకూరాలని మనమందరం ఆకాంక్షిద్దామని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi