
నెల్లూరు, 04 మే (హి.స.) ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని మంత్రి నారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(సోమవారం) ఉదయం నెల్లూరు జిల్లాలోని దస్తగిరి నగర్లో రూ.1.43 కోట్లతో చేపట్టబోయే సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంపై గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపి వెళ్లిందని... పరిశ్రమలు వెళ్లిపోయాయని.. రియల్ ఎస్టేట్ పడిపోయిందని విమర్శించారు.
అప్పులు తీరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. సీఎం చంద్రబాబు అనుభవంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని తెలిపారు. యువనేత లోకేశ్ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారన్నారు. ఈ ఏడాది దేశంలో వచ్చిన పరిశ్రమల్లో 25 శాతం ఏపీకి వచ్చాయని తెలిపారు. పరిశ్రమలు వస్తే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ‘మహానాడు ఎక్కడ పెట్టాలో చెప్పటానికి వైసీపీ నేతలు ఎవరు? మా పార్టీ అధినేత నిర్ణయిస్తారు’ అని అన్నారు. వైసీపీ తీరు మార్చుకోకపోతే ఆ పదకొండు సీట్లు కూడా ఈసారి రావని.. జనం గుండు సున్నా పెడతారంటూ మంత్రి నారాయణ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV