
హైదరాబాద్, 10 జూన్ (హి.స.)రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (BJP) వ్యూహంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆయన స్పష్టం చేశారు. సొంత బలంతోనే ఎన్నికల్లో పోటీ చేసి, రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే తమ ఏకైక లక్ష్యమని అమిత్ షా వివరించారు.
పంజాబ్ తరహా వ్యూహం
రాష్ట్రంలో పొత్తులపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, తెలంగాణ ఎన్నికల బరిలో బీజేపీ ఒంటరిగానే నిలుస్తుందని హోం మంత్రి తేల్చి చెప్పారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా తాము ఇదే విధమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని ఆయన ఉదహరించారు. గతంలో ఇతర పార్టీలకు అవకాశాలు ఇచ్చిన ప్రజలు, ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారని.. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నమ్ముకుని ఒంటరిగానే విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు