
యాదాద్రి భువనగిరి, 10 జూలై (హి.స.)
రైతుల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ
ప్రధాన లక్ష్యమని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) రైతులకు మరింత చేరువై పారదర్శకంగా సేవలు అందించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం రాజాపేటలో రేణికుంట పీఏసీఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన సేవలు అందించడం సహకార సంఘాల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
ఎరువులు, విత్తనాల సరఫరా, పంట రుణాల మంజూరు, ధాన్యం కొనుగోలు వంటి సేవలను సమర్థవంతంగా నిర్వహించి రైతులకు అండగా నిలవాలని సూచించారు. నూతన పాలకవర్గం రైతుల విశ్వాసాన్ని నిలబెట్టుకుని సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..