
హైదరాబాద్, 17 జూలై (హి.స.)
ప్రతి గ్రామానికి బ్యాంకు వెళ్లాలనేది ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రతి వర్గానికి బ్యాంకు సదుపాయాలు అందుబాటులో ఉండాలనేది ప్రధాని ఆశయమని ఆమె పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటు చేసిన రుణమేళా కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ మధ్యవర్తుల ద్వారా రుణం తీసుకోవడం చాలా కష్టమన్నారు. ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి రుణాలు ఇవ్వలేమా అని ప్రధాని మోదీ అడిగారని నిర్మల సీతారామన్ తెలిపారు. చిన్న వ్యాపారం చేసేవారికి ఏ గ్యారెంటీ లేకుండా రుణం ఇవ్వాలని, బ్యాంకుకు వచ్చిన వారికి సరైన న్యాయం చేయాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
'నిరర్ధక ఆస్తుల వల్ల బ్యాంకుల పనితీరు అంతగా బాగుండేది కాదు. బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చాం. చిన్న వ్యాపారులు రోజువారీ వడ్డీ వ్యాపారులతో ఇబ్బందులు పడేవారు. తోపుడు బండ్ల వారికి గ్యారంటీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా నేడు చర్యలు చేపట్టాం. ప్రభుత్వమే వారి తరపున గ్యారెంటీ ఇచ్చి రుణాలు అందించాం. బ్యాంకు రుణాలు తీసుకోవాలనే ఆలోచన గతంలో చాలామందికి ఉండేది కాదు. మోదీ సూచనలతో బ్యాంకులు ప్రజల వద్దకు వెళ్తున్నాయి. ఇవాళ లక్షల మందికి సులువుగా రుణాలు అందుతున్నాయి' అని నిర్మలా సీతారామన్ వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi