
హైదరాబాద్, 20 జూలై (హి.స.)
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, 'వందేమాతరం' గీతాన్ని ఆలపించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, సెప్టెంబర్ 17న ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించింది.
మూసాపేట్లోని పుల్లారెడ్డి పాఠశాలలో సోమవారం ఉత్సవ సమితి అధ్యక్షుడు జి. రాఘవ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలోని 32 కేంద్రాల నుంచి 64 మంది ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ మాట్లాడుతూ, యువతలో దేశభక్తిని పెంపొందించడం, సాంస్కృతిక విలువలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
యువతరానికి సనాతన ధర్మంపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ కోరింది. కుల వివక్షను రూపుమాపి, హిందూ ఐక్యతను బలోపేతం చేసేందుకు సంత్ రవిదాస్ 650వ జయంతిని, అలాగే సామాజిక చైతన్యం కోసం విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ జయంతిని వైభవంగా నిర్వహించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi