
హైదరాబాద్, 29 జూలై (హి.స.)
అంతర్జాతీయ పులుల దినోత్సవం (గ్లోబల్ టైగర్ డే) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకృతి ప్రేమికులకు మరియు వన్యప్రాణి సంరక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం పులుల జనాభాలో దాదాపు 70 శాతం భారతదేశంలోనే ఉండటం మనందరికీ ఎంతో గర్వకారణమని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ప్రకృతితో మమేకమై జీవించే మన శతాబ్దాల నాటి సంస్కృతి, ప్రజల సామూహిక భాగస్వామ్యమే ఈ విజయనానికి కారణమని ప్రధాని చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల్లో సంరక్షణ, స్థానిక ప్రజల భాగస్వామ్యం మరియు స్థిరమైన అభివృద్ధి ద్వారా పులుల సంరక్షణను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
అడవుల రక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న అటవీ శాఖ సిబ్బంది, శాస్త్రవేత్తలు మరియు వన్యప్రాణి నిపుణుల కృషిని ప్రధాని అభినందించారు. మానవులు-మృగాల నడుమ ఘర్షణలను తగ్గించి, స్థానిక సంఘాలను సాధికారత వైపు నడిపించేందుకు చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ప్రముఖ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్ పులుల సంరక్షణపై నిర్మించిన 10 అడుగుల ఇసుక శిల్పం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi