
పశ్చిమ గోదావరి జిల్లా:, 16 ఆగస్టు (హి.స.)
ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెరవలిలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గల్లంతయ్యారు. అదే కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డాడు.
గత్లంతైన వారిని పోతుల లక్ష్మీభాను (18), రాజా రామ్ (17), నాగిరెడ్డి దుస్వంత (18), నాగాబత్తుల సాయి సూర్య (19)గా, అలాగే ప్రమాదం నుంచి బయటపడిన యువకుడిని మట్టా సంతోశ్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాలువలోకి కారు దూసుకెళ్లడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ