
వనపర్తి, 19 ఆగస్టు (హి.స.)
పాము కాటు బాధితులకు సకాలంలో
మెరుగైన వైద్యం అందించి, ప్రాణ నష్టం జరగకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా పనిచేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన యాంటీ స్నేక్ వెనం, కుక్కకాటు మందుల నిల్వలను పరిశీలించారు. పాము కాటు కేసుల వివరాలను నివేదికగా సమర్పించాలని ఆదేశించారు. గర్భిణులకు హెమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి, రక్తహీనత ఉన్న వారికి అవసరమైన వైద్యం అందించాలని సూచించారు.
అనంతరం కానాయిపల్లి ఆర్ అండ్ ఆర్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ లెవలింగ్, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తకోట జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించి పదో తరగతిలో ఫిజిక్స్, ఇంగ్లిష్, గణితంలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీఎంహెచ్వో భాస్కర్ నాయక్, జడ్పీ సీఈవో యాదయ్య, మున్సిపల్ కమిషనర్ సైదయ్య, కొత్తకోట ఎంఈఓ కృష్ణయ్య, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు