
హైదరాబాద్, 19 ఆగస్టు (హి.స.)ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో, మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమాల వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. డీఎస్సీ అంశంపై చర్చకు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు.
డీఎస్సీ అంశంపై చర్చ కోసం మూడో రోజు కూడా తాను వేచి చూస్తున్నట్లు లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, జగన్ మాజీ ముఖ్యమంత్రి అని గుర్తు చేసిన ఆయన.. జగన్ కోరిన వేదికపై, ఆయన సొంత గడ్డపైనే చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ మేరకు 'స్టిల్ వెయిటింగ్' (ఇంకా ఎదురుచూస్తున్నా) అనే ట్యాగ్ను తన పోస్టుకు జత చేశారు.
లోకేశ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది మామూలు ర్యాగింగ్ కాదంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
మరోవైపు, బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో గూడూరులోని ఎల్లసిరి కాలువ పనులు, తిరుపతి టీడీఆర్ బాండ్ల వ్యవహారం, గ్రీన్ డేటా సెంటర్, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం, భవనాల క్రమబద్ధీకరణ వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది. సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi