
హైదరాబాద్, 19 ఆగస్టు (హి.స.)రాష్ట్రంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని టీడీపీ పొటిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఇదొక చారిత్రాత్మక అడుగు అని కొనియాడారు. ఈ గొప్ప చొరవ తీసుకున్నందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, కూటమి ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయంపై వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో జగన్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకు 2019 డిసెంబర్లో ఓ జీవోను తీసుకొచ్చిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఉందనే విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ, నాటి అధికార పార్టీయే కోర్టుకు వెళ్లి నాటకాలడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఇదంతా బీసీలను ఉద్దేశపూర్వకంగా మోసం చేయడానికి చేసిన కుట్ర అని ఆరోపించిన యనమల రామకృష్ణుడు... గత ఐదేళ్ల పాలనలో బీసీ సంక్షేమాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసినందుకుగాను జగన్ వెంటనే బీసీ వర్గాలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi