
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్
రావులు అధికారంలో లేమన్న తీవ్ర అసహనం, ఫ్రస్ట్రేషన్లో ప్రభుత్వంపై పిచ్చి ప్రలాపనలు చేస్తూ అడ్డగోలు విమర్శలకు దిగుతున్నారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. పదేళ్లపాటు రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోచుకుని దాచుకున్న బీఆర్ఎస్ నేతలు వీరప్పన్ కంటే మించిన ఘనులని ఘాటుగా విమర్శించారు. ఎలాంటి మచ్చ లేకుండా ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిని వీరప్పన్తో పోల్చడం సిగ్గుచేటన్నారు.
సెక్షన్ 22A నిషేధిత భూముల జాబితాపై గులాబీ పార్టీ కల్పిత ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఏయే భూములు ఆ జాబితాలో ఎందుకు ఉన్నాయో అసెంబ్లీ సాక్షిగా వివరిస్తామని చెప్పారు.
దశాబ్దాలుగా ఉన్న ప్రజా ఆస్తులు, కోర్టు వివాదాలు ఉన్న స్థలాలు మాత్రమే ఆ జాబితాలో ఉన్నాయని, భూ భారతి ద్వారా సాంకేతిక సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.
మరోవైపు భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరిని, బీసీ వ్యతిరేక విధానాలను ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ఎండగట్టారు. అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించకపోవడం దారుణమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..