
ఖమ్మం, 02 సెప్టెంబర్ (హి.స.)
సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. బుధవారం సత్తుపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై మెడికల్ సూపరింటెండెంట్ సురేష్ నారాయణ్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సత్తుపల్లిలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చి, అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన సిటీ స్కాన్, ఎంఆరొ స్కానింగ్ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సిటీ స్కాన్, ఎంఆర్ఎ పరికరాల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపామని, త్వరలోనే వాటిని ఆసుపత్రికి అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆసుపత్రి ప్రాంగణంలో నూతన ఆర్వో వాటర్ ప్లాంట్ను నిర్మించినట్లు తెలిపారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి శస్త్రచికిత్సల సంఖ్యను పెంచాలని, రెఫరల్ కేసులను తగ్గించాలని ఎమ్మెల్యే వైద్యులను కోరారు. స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందేలా నమ్మకం కల్పించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..