బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
సముద్ర మట్టంలో సంభవిస్తున్న వాతావరణ మార్పుల కారణంగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రూపుదిద్దుకుంటోంది.
Rain


కర్నూలు, 05 సెప్టెంబర్ (హి.స.) సముద్ర మట్టంలో సంభవిస్తున్న వాతావరణ మార్పుల కారణంగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రూపుదిద్దుకుంటోంది.

ఈ ప్రభావం వల్ల రానున్న కొద్ది గంటల వ్యవధిలోనే వర్షాలు దంచికొట్టనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఏడు జిల్లాలకు తక్షణమే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ అధికారులు యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు.

ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా బలమైన వానలు కురిసే అవకాశం ఉందన్ అధికారులు తెలిపారు. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీస్తాయి. సెప్టెంబర్ 8 వరకు రాష్ట్రంలో వర్షాల తీవ్రత కొనసాగుతుందని, ఈదురుగాలులు వీచే వేళ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ నిలబడవద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

మరోవైపు తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోనూ వాతావరణం వేగంగా మారిపోతోంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ, శుక్రవారం సాయంత్రం ఆదిలాబాద్, నిర్మల్ పరిసరాల్లో వానలు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, బుర్ఘంపాడు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసాయి. సెప్టెంబర్ 12 వరకు తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ వ్యాప్తంగా వాతావరణంలో అనిశ్చితి కొనసాగుతుందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande